
మణిరత్నం వంటి మహాదర్శకుడు కూడా హీరోయిన్ దీపిక పదుకోన్ కే మద్దతు ప్రకటించారు. షూటింగ్ టైం తక్కువ ఉండేలా చూడమని దర్శక, నిర్మాతలను అడిగే హక్కు పిల్ల తల్లులకు ఉంటుంది అని మణిరత్నం స్పష్టం చేశారు. దీపిక ఆ ఉద్దేశంతో డిమాండ్ చేసి ఉంటే అందులో తప్పు పట్టాల్సింది లేదు అని అన్నారు.
ఇటీవల దీపిక పదుకోన్ డిమాండ్స్ ని తట్టుకోలేక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమెతో సినిమా చేసేందుకు నిరాకరించారు. “స్పిరిట్” సినిమాలో ప్రభాస్ సరసన దీపికని తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె భారీ పారితోషికంతో పాటు కేవలం రోజుకి ఆరు గంటలే పని చేస్తాను, నాకు 26 మంది సహాయ సిబ్బంది కావాలి వంటి కోరికల చిట్టా బయటపెట్టింది.
ఐతే, ఈ వివాదం చివరికి ఎలా మారింది అంటే పిల్ల తల్లి దీపిక తన కూతురిని చూసుకునేందుకు తక్కువ షూటింగ్ టైం అడిగితే సందీప్ రెడ్డి వంగా నిరాకరించినట్లు, మొత్తం వివాదం దీనికోసమే అన్నట్లు బాలీవుడ్ మీడియా చిత్రీకరించడం మొదలుపెట్టింది. ఆ పాయింట్ లోనే మణిరత్నం సమాధానం ఇచ్చారు. “ఒకవేళ మనం తీస్తున్న సినిమాకి తక్కువ టైం కోరే నటులు సూట్ అవకపోతే… వేరే వాళ్ళతో వెళ్లిపోవడమే. అందులో తప్పులేదు. అలాగే పిల్ల తల్లుల డిమాండ్స్ కూడా సబబే,” అని మణిరత్నం సపోర్ట్ చేశారు.
మణిరత్నం దీపిక పదుకోన్ డిమాండ్లను తప్పు పట్టలేదు. కానీ వంగా – దీపిక మధ్య గొడవకి లేదా భేదాభిప్రాయాలు అది కారణం కాదు. ఆమె పెట్టిన అనేక కండీషన్లు, డిమాండ్లు అతనికి సబబుగా అనిపించలేదు. దానికి తోడు, ఆమె స్థానంలో మరో హీరోయిన్ త్రిప్తి డిమ్రిని తీసుకుంటే ఆ సినిమాలో “అడల్ట్” సన్నివేశాలు ఉన్నాయి అని దీపిక టీం వార్తలు రాయించిందట. దాంతో, వంగా ఇన్ డైరెక్ట్ గా ఆమెని తిట్టాడు.