
శింగనమల రమేష్ అనే ఓ పాత తరం నిర్మాత చేసిన ఒకే ఒక్క కామెంట్ తో ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్, అటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఏకమయ్యారు. శింగనమలపై విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏం కామెంట్ చేశాడు.?
తన కోర్టు కేసు క్లియర్ అయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టాడు శింగనమల రమేష్. గతంలో తను తీసిన “ఖలేజా”, “కొమరం పులి” సినిమాలపై స్పందించాడు. ఆ సినిమాల వల్ల తనకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు. అప్పట్లోనే కొమరం పులి సినిమాకు మూడేళ్లు టైమ్ పట్టిందని, అదే తన కొంప ముంచిందన్నాడు.
ఈ వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. బండ్ల గణేశ్ మరో అడుగు ముందుకేశాడు. ఆ సినిమా టైమ్ లో తను ప్రత్యక్ష సాక్షినని, ప్లానింగ్ లేకుండా మూడేళ్లు సినిమా తీసి, పవన్ కు చెందిన అమూల్యమైన వందలాది కాల్షీట్లను నిర్మాత వృధా చేశారని, ఇకనైనా ఇలాంటి విమర్శలు చేయడం ఆపుకోవాలని అన్నాడు.
ఇటు మహేష్ ఫ్యాన్స్ కూడా డ్యూటీ ఎక్కారు. “ఖలేజా” సినిమాను అటుఇటుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా… అంతకుమించి నష్టాలు ఎలా వస్తాయో చెప్పాలని శింగనమలను డిమాండ్ చేస్తున్నారు.