
కొన్ని సినిమాలు సడెన్ గా వార్తా మాధ్యమం నుంచి మాయమౌతాయి. ఆ తర్వాత ఉన్నఫలంగా ప్రత్యక్షమౌతుంటాయి. ఇది అలాంటి సినిమానే. సుహాస్-కీర్తిసురేష్ కాంబినేషన్ పై అప్పట్లో భలే చర్చ జరిగింది. కట్ చేస్తే, ఆ తర్వాత మాయమైంది. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్షమైంది. నేరుగా ఓటీటీలోకి వస్తోంది.
కీర్తి సురేష్, సుహాస్ కలిసి నటించిన కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమా డైరక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూలై 4న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ పెడుతున్నారు. స్మశాన వాటిక నేపథ్యంలో, విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమా ఇది. కీర్తిసురేష్ కు డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కొత్త కాదు, ఇంతకుముందు ఆమె నటించిన సినిమా ఒకటి ఇలానే డైరక్ట్ ఓటీటీలోకి వచ్చింది.
అయితే ఇక్కడ మేటర్ అది కాదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కీర్తిసురేష్ నుంచి తెలుగులో వస్తున్న సినిమా ఇది. ‘భోళాశంకర్’ డిజాస్టర్ తర్వాత కీర్తి మళ్లీ కనిపించలేదు. ఇప్పుడీ ‘ఉప్పు కప్పురంబు’తో ఆమె మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.