హీరోయిన్ ఎమీ జాక్సన్ మరోసారి తల్లి కాబోతోంది. ఈమధ్య సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ, ఈ ఏడాది పూర్తిస్థాయిలో వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా మరోసారి పెళ్లి చేసుకున్న ఎమీ, ఇప్పుడు మరోసారి బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అవుతోంది.
లండన్ కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనయాటుతో నాలుగేళ్లు డేటింగ్ చేసింది ఎమీ జాక్సన్. వాళ్ల డేటింగ్ కు గుర్తుగా కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత 2019లో వాళ్లు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే 2021లో విడిపోయారు.
అలా బాబుతో సింగిల్ మదర్ గా కొనసాగిన ఎమీ జాక్సన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏడాదికే మరో తోడు వెదుక్కుంది. ఈసారి బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్ విక్ తో డేటింగ్ చేసింది. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయలేదు ఎమీ.
ఈ ఏడాది ప్రారంభంలోనే అతడితో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఆగస్ట్ లో పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడు అతడి ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి రెడీ అయింది.
సౌత్ లో ‘మద్రాసిపట్టణమ్’, ‘ఐ’, ‘2.O’ లాంటి సినిమాలతో పాపులర్ అయింది ఎమీ. తెలుగులో ఆమె రామ్ చరణ్ సరసన ‘ఎవడు’ సినిమా చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆమె నటించిన ‘మిషన్ ఛాప్టర్-1’ రిలీజైంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సినిమాలు కొనసాగించబోతోంది ఈ బ్యూటీ.