
ఈమాట మేం చెప్పడం లేదు. స్వయంగా రజనీకాంత్ నోటి నుంచి వచ్చిన మాట ఇది. చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణకు హాజరయ్యారు సూపర్ స్టార్. ఆ కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
ఇలాంటి కార్యక్రమాలకు తెలివైన వాళ్లను ఆహ్వానిస్తే బాగుంటుందని, అందుకు శివకుమార్, కమల్ హాసన్ లాంటి వాళ్లు సరైన వాళ్లు అని అన్నారు రజనీకాంత్. తన కంటే వీళ్లిద్దరూ చాలా తెలివైన వాళ్లంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.
75 ఏళ్ల వయసులో నల్లటి కళ్లజోడు పెట్టుకొని, స్లో మోషన్ లో నడుస్తూ సినిమాలు చేసుకునే తనలాంటి వాడ్ని ఈ పుస్తకావిష్కరణ కోసం ఎందుకు ఆహ్వానించారో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ నవ్వులు పూయించారు రజనీకాంత్.
ఏ పుస్తకావిష్కరణకు వచ్చారో, ఆ పుస్తకాన్ని తానింకా చదవలేదన్నారు సూపర్ స్టార్. ఓ పావలా వాట మాత్రం చదివానని, మిగతా భాగాన్ని సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత చదువుతానంటూ మరోసారి జోకులు వేశారు.















