
‘థగ్ లైఫ్’ సినిమాకి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు కర్ణాటక ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. కమల్ హాసన్ ని సమర్ధించింది. ఈ తీర్పుతో కమల్ హాసన్ గెలిచినట్లైంది.
ఈ నెల జూన్ 5న “థగ్ లైఫ్” విడుదలైంది. కానీ కన్నడనాట రిలీజ్ అవ్వలేదు. దీనికి కారణం కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే. తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడుతూ క్షమాపణలు చెప్పనని మొండికేశారు. దాంతో, కన్నడ సంఘాలు ఆ సినిమాని విడుదల చెయ్యనివ్వలేదు కర్ణాటకలో.
ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై భారీ డిజాస్టర్ అయింది. ఈ సినిమాతో భారీ నష్టాలు తెచ్చిపెట్టుకున్నాడు కమల్ హాసన్. కన్నడనాట రిలీజ్ అయినట్టయితే కొంత నష్టాలు తగ్గేవని ట్రేడ్ భావిస్తోంది.అయినా ఇలాంటి ఫ్లాపులు, వివాదాలు కమల్ కు కొత్త కాదు. ఇక ఈ డబ్బుల లెక్కలు ఆయన ఎప్పుడూ వేసుకోలేదు.
తప్పు చెయ్యకుండా నేను సారీ చెప్పను అని కమల్ హాసన్ భీష్మించుకున్నారు. సుప్రీం కోర్టు కూడా ఆయన వైఖరిని సమర్ధించింది.
“కమల్ హాసన్ చేసిన కామెంట్స్ (తమిళం నుంచే కన్నడ పుట్టింది అని కమల్ అన్నారు)లో నిజం ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. అది ఒక అభిప్రాయం. దానిపై వాదన చెయ్యవచ్చు. కానీ క్షమాపణ చెప్తేనే రిలీజ్ చెయ్యనిస్తాం అని బెదిరించడం అంటే దానికి ప్రభుత్వం వత్తాసు పలకడం ఏంటి,” అని సుప్రీం కోర్టు గట్టిగా ఇచ్చింది.
దాంతో కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. కానీ ఫ్లాప్ అయిన ఈ సినిమాని ఎవరు చూస్తారు.
కమల్ తన సిద్ధాంతాలకు గెలుపు దక్కింది అనుకోవాలి. కానీ ఆర్థికంగా మాత్రం నష్టపోయారు.