
మెగాస్టార్ చిరంజీవికి ఒక కల ఉంది. తన కుమారుడు రామ్ చరణ్ తన ఐకానిక్ మూవీ సీక్వెల్ లో నటించాలని అనేది ఆయన కల. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు. ఐతే, కేవలం తన హిట్ సినిమా సీక్వెల్ లో రామ్ చరణ్ నటించాలనేది మాత్రమే ఆయన డ్రీం కాదు. ఆ సినిమాకి ఒక డ్రీం టీంని కూడా ఆయన కోరుకుంటున్నారు.
ఆ సినిమా పేరు… జగదేక వీరుడు అతిలోక సుందరి 2. 1990లో విడుదలైన “జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమాకి సీక్వెల్. ఈ సినిమా ఈ రోజు (మే 9, 2025) మళ్ళీ థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా చిరంజీవి సీక్వెల్ గురించి డ్రీం టీం చెప్పారు.
ఆయన కోరుకుంటున్న టీం ఇదే ….
హీరో: రామ్ చరణ్
హీరోయిన్: జాన్వీ కపూర్
దర్శకుడు: నాగ్ అశ్విన్
నిర్మాతలు: స్వప్న దత్, ప్రియాంక దత్
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు
కానీ ఇది సాధ్యం అవుతుందా? ఆ డౌట్స్ రావడానికి కారణాలు ఉన్నాయి.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ “జగదేక వీరుడు అతిలోక సుందరి 2″లో నటిస్తే క్రేజ్ వస్తుంది. కానీ రామ్ చరణ్, జాన్వీ కలిసి ఇప్పటికే “పెద్ది” అనే సినిమాలో నటిస్తున్నారు. సో, వీరి కాంబినేషన్ లో ఉండే ఫ్రెష్ నెస్ “పెద్ది”తోనే ముగుస్తుంది. “జగదేక వీరుడు అతిలోక సుందరి 2” అంటూ తీస్తే జాన్వీ, చరణ్ కలిసి నటించినా కొత్తదనం ఉండదు. దానికితోడు, నాగ్ అశ్విన్ ఇప్పుడు ఇలాంటి సీక్వెల్స్ కి అంగీకరించలేడు. ఎందుకంటే, ఆయన “కల్కి 2” తీయాలి. ఆ తర్వాత కూడా ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి.
నాగ్ అశ్విన్, రామ్ చరణ్, జాన్వీ కపూర్ ల కాంబినేషన్ లో “జగదేక వీరుడు అతిలోక సుందరి 2” ఈ పాటికే వచ్చి ఉంటే క్రేజ్ వేరుగా ఉండేది. భవిష్యత్ లో ఎప్పుడో తీస్తే మజా ఉండదు. అందుకే చిరంజీవి డ్రీం కలగానే మిగిలిపోతుంది అనిపిస్తోంది.