
ఒకప్పుడు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి బాలీవుడ్ హీరోల పారితోషికాలు అధికంగా ఉండేవి. దక్షిణాదిలో రజినీకాంత్ అగ్రస్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారింది. తెలుగు హీరోలు దూసుకొచ్చారు. ప్రభాస్, అల్లు అర్జున్ మొత్తం సీన్ మార్చేశారు. ఐతే, ఇప్పుడు అల్లు అర్జున్ ని కూడా వెనక్కి నెట్టేసి రజినీకాంత్ ముందుకొచ్చాడు. తానే నెంబర్ వన్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.
రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తీసిన “కూలీ” చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే “జైలర్ 2” సినిమా షూటింగ్ మొదలవుతుంది. “జైలర్” సినిమాతో రజినీకాంత్ తమిళ సినిమాల వరకు కొత్త రికార్డులు సెట్ చేశారు. దాంతో, నిర్మాణ సంస్థ రజినీకాంత్ రికార్డ్ పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించింది.
అలా మళ్ళీ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా అవతరించారు. రజినీకాంత్ తర్వాతి ప్లేస్ కూడా ఒక తమిళ హీరోదే. తలపతి విజయ్ తన చివరి చిత్రంగా “జన నాయకన్” అనే సినిమా చేస్తున్నారు. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే విజయ్ ప్రస్తుతం సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇస్తున్నారు. తర్వాత చేస్తారో లేదు తెలీదు. ప్రస్తుతం ఐతే ఇదే చివరి చిత్రం అని చెప్తున్నారు. ఈ సినిమాకి అత్యధిక పారితోషికం తీసుకున్నారు.
ఆ తర్వాతి స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. “పుష్ప 2” సినిమా తర్వాత అల్లు అర్జున్ పారితోషికంతో పాటు వ్యాపారంలో వాటా తీసుకుంటున్నారు. ఆ తర్వాతి ప్లేస్ ప్రభాస్ ది. ప్రభాస్ మూడేళ్ళ క్రితం వరకు అగ్రస్థానంలో ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రభాస్ భారీగా తీసుకోవడం లేదు. ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ సంపాదించే ఆలోచనలో ఉన్నారు. అందుకే, ప్రభాస్ చేతిలో ఆరేడు సినిమాలు ఉన్నాయి. తర్వాత స్థానంలో తమిళ స్టార్ అజిత్ కుమార్ ఉంటారు.
దక్షిణాది అగ్ర హీరోల పారితోషికాలు ఇవే
- రజినీకాంత్ – రూ. 270 కోట్లు
- విజయ్ – రూ. 250 కోట్లు
- అల్లు అర్జున్ – రూ. 175 కోట్లు +15 శాతం వాటా
- ప్రభాస్ – రూ. 175 కోట్లు
- అజిత్ కుమార్ – రూ. 160 కోట్లు