
తమిళ హీరో జయం రవి గురించి ఘాటుగా లేఖ విడుదల చేసింది ఆయన మాజీ భార్య ఆర్తి రవి. భర్తగా బాధ్యతలు వదిలేసి సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఎప్పుడో పారిపోయాడు, తండ్రిగా కూడా ఇప్పుడు బాధ్యతలు మరిచాడు అని ఆమె ఆరోపిస్తున్నారు.
గతేడాది జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు. 14 ఏళ్ళు కాపురం తర్వాత విడాకులు అని చెప్పి బయటికి వచ్చేశాడు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. కొడుకులను కూడా ఆమెకి వదిలేసి వేరే ఇంటికి వెళ్ళిపోయాడు రవి. ఐతే, గతేడాదే ఆర్తి తన భర్త మరో స్త్రీ కోసం తనని వదిలేస్తున్నాడు అని ఆరోపణ చేశారు. బెంగుళూర్ కి చెందిన కెన్సెస్ అనే గాయనితో సంబంధం పెట్టుకొని, తనకి డివోర్స్ ఇస్తున్నాడు అని ఆమె అప్పట్లో మీడియాకి తెలిపింది.
ఐతే, అప్పుడు జయం రవి ఆమె చేస్తున్న ఆరోపణలు అన్ని అబద్దమని చెప్పాడు. అంతేకాదు, తనకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదని, మొత్తం డబ్బు అంతా ఆర్తి ఉంచేసుకుందని, కట్టుబట్టలతో తనని ఇంట్లో నుంచి గెంటేశారని అన్నట్లుగా జయం రవి పేర్కొన్నాడు. ఎవరితో ఎఫైర్ లేదని కూడా స్పష్టం చేశాడు.
ఐతే తాజాగా చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు జయం రవి కెన్సెస్ అనే గాయనితోనే కలిసి వచ్చాడు. అందరికీ తన “పార్ట్నర్” అని పరిచయం చేశాడు.
ఈ నేపథ్యంలో ఆర్తి తాజాగా ఒక లెటర్ విడుదల చేసింది. “రవి చెప్పిన మాటలు అబద్దాలు, చేష్టలు అన్నీ తప్పుడు పనులే అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. నిజం నిలకడగా బయటపడింది. అతన్ని ప్రేమించాను. కానీ నన్ను, నా పిల్లలను అన్యాయం చేశాడు. ఇప్పుడు ఇల్లు కూడా లాకుంటున్నారు. భర్తగా మాట తప్పినా తండ్రిగా నా పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటాడు అనుకున్నాను. వారికి కూడా ఇప్పుడు అన్యాయం చేస్తున్నాడు,” అని ఆమె తాజాగా ఆరోపించింది.