
పవన్ కళ్యాణ్ నటించిన “హరి హర వీర మల్లు” సినిమా విడుదలకు ఇబ్బంది పడుతోంది. మొన్నటి వరకు షూటింగ్ పూర్తికాక నిర్మాత ఏ.ఎం.రత్నం తిప్పలు పడ్డారు. ఇప్పుడు షూటింగ్ పూర్తి చేసుకొని జూన్ 12న విడుదల కావాల్సిన టైంలో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. దానికి అనేక కారణాలు. ప్రధానమైనది … గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడం. అంతకన్నా ప్రధానమైనది… ఈ సినిమా కోసం తీసుకున్న అప్పులు, అంతకుముందు నిర్మించిన సినిమాల మీద ఉన్న బకాయిలు తీర్చడం.
అదే నిర్మాత రత్నంకున్న పెద్ద సమస్య. థియేటర్ హక్కులు అమ్మితే ఈ సినిమా సమస్యలు చాలావరకు సమసిపోతాయి. కానీ, నిర్మాత అడిగే రేటు, బయ్యర్లు చెపుతున్న రేటు మధ్య బేరం కుదరడం లేదు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇప్పటివరకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. నాలుగేళ్ల క్రితం 11 కోట్ల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇప్పుడు అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. ఆ 11 కోట్లు కూడా నిర్మాతకు కలిసి వచ్చి సినిమా విడుదల సాఫీగా అవుతుంది. అంటే… 11 కోట్లు పవన్ తిరిగి ఇస్తే… సినిమా మొత్తం ఫ్రీగా చేసినట్లే.