
తెలుగు సినిమా కొంతకాలంగా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కొత్త సినిమాలకు కలెక్షన్లు ఉండడం లేదు. ఎంత ప్రచారం చేసినా కొన్ని సినిమాలను జనం అస్సలు పట్టించుకోవడం లేదు. థియేటర్ల వైపు వెళ్లడం లేదు. మరోవైపు, హీరోల అభిమానులు తమ హీరోల పాత సినిమాలను వైభవంగా మళ్ళీ విడుదల చేస్తున్నారు.
గబ్బర్ సింగ్, ఖుషి, ఆది, ఖలేజా, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోక సుందరి,… ఇలా పాత సినిమాలన్నీ ఇటీవల గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యాయి. వాటికి బోలెడంత ప్రచారం, హంగామా జరిగింది. ఈ వీకెండ్ “భైరవం” సినిమా, మహేష్ బాబు పాత సినిమా “ఖలేజా” ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. మహేష్ బాబు అభిమానులు దానికి విపరీతంగా ప్రచారం కల్పించారు. సినిమాకి 4 కోట్ల పైన కలెక్షన్ పొందింది మొదటి రోజు.
“భైరవం” సినిమాకి అందులో సగం కూడా రాలేదు మొదటి రోజు. నిజానికి “భైరవం” సినిమాకి భారీగా ప్రచారం చేశారు. అయినా అటెన్సన్ అంతా “ఖలేజా” వైపు వెళ్ళింది.
“పండగల సమయాల్లో ఎలాగూ పెద్ద సినిమాలే డేట్స్ అన్నీ లాగేసుకుంటాయి. ఇలాంటి సమయాల్లో కూడా ఇలా పెద్ద హీరోల పాత సినిమాలను విడుదల చేసి మాలాంటి సినిమాలకు పోటీ ఇవ్వడం కరెక్టేనా?” అని భైరవం మేకర్స్ ప్రశ్న వేశారు.
నిజంగా ఈ పాత సినిమాల రీరిలీజులు కొత్త సినిమాలకు శాపంగా మారాయి. విచిత్రం ఏంటంటే జనం కొత్త సినిమాలను నాలుగు వారాలు ఆగి ఓటిటిలో చూస్తున్నారు… పాత సినిమాలను థియేటర్లో చూస్తున్నారు.