
హీరో శ్రీవిష్ణు ప్రతి సినిమాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడు. “ఓం భీం బుష్” సినిమాలో ఒక మగ దెయ్యం అతన్ని ప్రేమిస్తుంది. ఇక ఆయన గత చిత్రంలో శ్రీవిష్ణు అనేక పాత్రలు పోషించాడు. అందులో ఒక కీలకమైన పాత్ర… ట్రాన్స్ జెండర్. ఐతే, దాన్ని జనం జీర్ణించుకోలేదు. సినిమా ఘోరంగా పరాజయం పాలు అయింది.
ప్రస్తుతం “సింగిల్” అనే సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శ్రీ విష్ణు “స్వాగ్” విషయంలో చేసిన తప్పు గురించి మాట్లాడాడు.
“సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో స్వాగ్ కూడా ఫుల్లుగా కామెడీతో ఉంటుంది అని జనం భావించారు. కానీ జనం థియేటర్లోకి వచ్చాక వాళ్ల అంచనాలకు, సినిమా కంటెంట్ కి ఉన్న మిస్ మ్యాచ్ తో ఇబ్బంది పడ్డారు. కథ విషయంలో, ఎలాంటి సినిమా అనే విషయంలో జనాలకు ముందే చెప్పడంలో మేం ఫెయిల్ అయ్యాం. జనాలని ముందే ప్రిపేర్ చేసి ఉంటె ఫలితం వేరుగా ఉండేది. ఆ తప్పు చేసి ఉండకపోతే సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చి ఉండేది,” అని శ్రీ విష్ణు తెలిపారు.
“ప్రయోగం చేసినప్పుడు అది ఫలితాన్ని ఇవ్వకపోతే అది ఒక అనుభవంగా, ఒక పాఠంగానే చూస్తాను. వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం,” అని క్లారిటీ ఇచ్చారు శ్రీవిష్ణు.