
ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడారు. వ్యక్తిగత జీవితం మొదలుకొని రాజకీయాల వరకు అనేక విషయాలు అందులో చర్చలోకి వచ్చాయి. దేశం, సమాజం, మతం, స్త్రీ స్వాలంబన… ఇలా అనేక అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.
ఐతే, మిగతా విషయాలను అన్నింటిని వదిలేసి టీవీ మీడియా, వెబ్ సైట్లు, పత్రికలు, సోషల్ మీడియా ఆమె రెండో పెళ్లి గురించి చెప్పిన మాటలకే ప్రాధాన్యం కల్పించాయి. దాంతో రేణుకి చిర్రెత్తుకొచ్చింది.
“నా రెండో పెళ్లి గురించి వర్రీ కావడం మీడియా మానెయ్యాలి. ఇద్దరు ఎదిగిన పిల్లల తల్లిని. నాకు ఇప్పుడు 43 ఏళ్ళు. ఎప్పుడు ఏమి చెయ్యాలో నాకు తెలుసు. నా రెండో పెళ్లి గురించి మీరు తెగ ఇదవకండి. మంచి జర్నలిజం చెయ్యండి,” అంటూ ఆమె మీడియాకి హితబోధ చేశారు.
రేణు దేశాయి, పవన్ కళ్యాణ్ తో విడిపోయాయి దాదాపు 13 ఏళ్ళు కావొస్తోంది. పవన్ కళ్యాణ్ మూడోసారి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె మాత్రం పవన్ కళ్యాణ్, తనకు పుట్టిన పిల్లలను చూసుకుంటూ సింగిల్ గా ఉండిపోయారు. అందుకే ఆమె రెండో పెళ్లి గురించి ఎప్పుడూ చర్చే నడుస్తోంది.